హైదరాబాద్: నక్కల (సంచార జాతి) కులస్తులకు చట్టపరంగా కుల సర్టిఫికెట్స్ పంపిణీ జరగడంతో ఈ సామాజిక వర్గ ప్రజలు ఆనందబాష్పాలతో ఎంతో సంతోషిస్తున్నారు. ఇందుకోసం తామంతా ఎంత కష్టపడిందీ, ఎన్ని అవమానాలకు గురైందీ, చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ దుర్భరమైన దారుణ పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో కారు చీకటిలో కాంతి రేఖలా, ఎడారిలో ఓయాసిస్సులా తమకు "సామాజిక సమరసతా వేదిక" ఏ విధంగా అండగా తోడు నీడగా నిలిచిందో వీరు వివరించారు. వారి ఆవేదన ఆనందంగా మారిన ఘట్టాలను వారి మాటల్లోనే చదువుదామా...అందరికీ నమస్కారాలు!
ఈ నక్కల కమ్యూనిటీ ప్రజల ఆవేదన - ఆనందాల కథ వినండి
మా నక్కల కులస్తులకు చట్టం ప్రకారం ప్రభుత్వం ఎస్టీ సర్టిఫికేట్లను ఇటీవల మంజూరు చేసింది. లక్షలాది మా నక్కల కులస్తులు ఈ ST సర్టిఫికెట్స్ కోసం 7, 8 సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు. భయం, అవిశ్వాసం, అమాయకత్వం, అవిద్య కారణంగా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోకి ధైర్యంగా వెళ్లలేక పోయాం. పోలీస్ స్టేషన్లకు పోవాలంటేనే భయపడిపోయాం. నాయకులు మా ఓట్లు తీసుకున్నారు కాని మాకు న్యాయం చేయలేదు. కొందరు ST ఆఫీసర్లు మాకు సహాయం చేయకపోగా మమ్మల్ని వివక్షతో చూసారు. మీరు STలు కాదంటూ ఆఫీస్లలోకే రానివ్వలేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ని కలిసి వినతి పత్రం ఇచ్చి వస్తే, కొందరు ST వ్యక్తులే ఫోన్ చేసి బెదిరించారు. మీరు ST అని చెప్పుకోవద్దు అని చెప్పారు. ఇంకొందరైతే మీరు మాకు పోటీగా వస్తారా? అంటూ వెక్కిరించారు.
మా విద్యార్థులు కుల సర్టిఫికెట్స్ పొందని కారణంగా చదువులు మధ్యలో ఆపేసారు. ప్రభుత్వ పథకాలు తెలియక ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడ్డారు. ఇటువంటి దుస్థితిలో పిట్టలోళ్ళు, నక్కలోళ్ళుగా పుట్టడమే మా పాపమా? అని వేదన చెందాము. మమ్మల్ని మనుషులుగా చూసి గౌరవించేవారే లేకపోయారు. మేము పడిన మానసిక క్షోభను అర్థం చేసుకున్నవారే లేకపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, వైద్యపరంగా మేము 40 సంవత్సరాలుగా వెనుకబడిపోయి, జీవితం మీదనే ఆశలు కోల్పోయి జీవచ్ఛవాలుగా బ్రతుకులు వెళ్ళదీస్తూ వచ్చాము.
ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతి రేఖలా, ఎడారిలో ఓయాసిస్సులా మాకు అండగా తోడు నీడగా నిలిచింది "సామాజిక సమరసతా వేదిక" సంస్థ. అందె గ్రామ యువకులతో 8 సంవత్సరాల క్రితం మా ఇళ్లకు వచ్చి సర్వే చేసి మా ఆర్థిక, సామాజిక పరిస్థితులు అధ్యయనం చేసినప్పుడు, మా బ్రతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరించాయి.
మమ్మల్ని ఒకే త్రాటి మీదికి తీసుకొచ్చి ఐక్యం చేసి, మా ఆచారాలు, సంప్రదాయలు గుర్తు చేశారు. అన్ని పండుగలు ఘనంగా జరిపేట్లు యోజన చేసి మత మార్పిడులకు అడ్డుకట్ట వేసి,మమ్మల్ని హిందువులుగా చైతన్యం చేశారు. మా కులానికి ఆరాధ్య దేవత దుర్గమ్మ, కాళీ మాతలను స్వేచ్ఛగా, ఆనందంగా కొలిచే వాతావరణం కల్పించారు. చలికాలంలో దుప్పట్లు ఇచ్చి, మా విద్యార్థులకు పుస్తకాలు నోట్ బుక్స్ అందించారు. అందె పాఠశాలకి వెళ్ళడానికి సైకిళ్ళు పంపిణి చేయడంతో పాటుగా మా చిన్న ముత్యంపేట గ్రామంలో విద్యార్థులకు ట్యూషన్ సెంటర్లు ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులను కళాశాలల్లో చేర్పించి, డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజ్ చెల్లించారు. కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు అందించారు. మా మహిళలకు చీరలు పంపిణి చేసి దసరా, వినాయక చవితి, శివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి సహకరించారు. ప్రత్యేకంగా పూజలు చేయించారు. మా గృహాలు శుభ్రంగా ఉండేట్లు, తులసి చెట్లు ఇంటింటా పెంచుకునేట్లు ప్రోత్సాహించి మా ఊరిలో గోమాతకు సేవ చేసే భాగ్యం కలిగించారు.
మా ఊరి అమ్మాయిని నర్సింగ్ కోర్స్లో చేర్పించి, గజ్వేల్లోని డా నరేష్ బాబు గారింట్లో వసతి కల్పించారు. ఆమె శిక్షణ పొంది ఇప్పుడు సిద్దిపేటలో ఉద్యోగం చేయటం మాకు ఆనందంగా వుంది. మరో ఇద్దరు అమ్మాయిలను తడ్కపల్లి ఆవాసంలో చేర్పించి, చదువుతో పాటు సంస్కారం నేర్చుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రమంతటా మా యువకులు వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి మమ్మల్ని గౌరవించారు. పూరి గుడిసెల్లో బ్రతుకుతున్న మా దీన హీన పరిస్థితులను వివరిస్తూ, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ఒత్తిడి తెచ్చి, కొన్ని డబుల్ బెడ్ రూంలు నిర్మింపజేశారు. వ్యసనాలు, దురలవాట్లు లేకుండా మేము ప్రతి క్షణం ఎదగడానికి ప్రతి అవకాశం కల్పించారు. MRO ఆఫీస్ మొదలుకుని RDO, కలెక్టర్, జిల్లా రాష్ట్ర గిరిజన అధికారులు ఇలా రాష్ట్ర గవర్నర్ని కూడా కలిపించి, మా వెతలు, కష్టాలు చెప్పించారు.
ఇది మాములు పోరాటం కాదు 8,9 సంవత్సరాలుగా సామాజిక సమరసత బడుగు బలహీన వర్గాల గురించి ఉపన్యాసాలు కాదు, చేతల్లో చూపించింది. ఆఖరున సిద్దిపేట న్యాయస్థానం తలుపు కూడా తట్టి, అక్కడి ఇద్దరు మహిళా న్యాయమూర్తుల వద్దకు వెళ్లి మా సమస్యలు వివరించి, రిట్ పిటిషన్ వేసేటట్లు చేశారు. మాలో ఐక్యత, ధైర్యం విశ్వాసం, ఆశయ ఆకాంక్షలు రెండింతలు అయ్యాయి. మేమూ భారతీయులం, 140 కోట్ల ప్రజల్లో మేమూ మనుషులమే.. మేమూ దేశ భక్తులమే.. మాకూ హక్కులు, బాధ్యతలు ఉన్నాయని ఎరుకపరిచారు. అలుపెరుగక న్యాయం ధర్మం కోసం పోరాటం చేసే కొండంత ధైర్యం మాకు వచ్చిందంటే సమరసత వేదిక కార్యకర్తలే కారణం. కోర్ట్ నుండి ఆర్డర్ పత్రాలు తీసుకుని MRO ఆఫీస్కి వెళ్ళాము. స్వయంగా MRO గారు మా ఊరికి వచ్చారు. మా సమస్యలు ఓర్పుతో విన్నారు. మీరు ST సర్టిఫికెట్స్ పొందడానికి అర్హులే అంటూ మాకు హామీ ఇచ్చారు. మే 21వ తేదీ మా జీవితంలో పరమానందం కలిగిన రోజు. మొదటగా నలుగురం ST సర్టిఫికెట్స్ చేతుల ద్వారా తీసుకుంటుంటే మా కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లు జలజల రాలినయి. మా భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తినయి.
మాకు తోడు నీడగా వున్న వారందరందరికి మా కృతజ్ఞతలు. రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ, దుబ్బాక రాజన్న, బంటు స్వామన్న, సిద్దిపేట సంతోష్ అన్న, రమేశన్న, మా పూరి గుడిసెలకు వచ్చి సేవ చేసిన మరణించి స్వర్గంలో ఉన్న రత్నం సార్... ఇలా అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
ఇట్లు
కాల్య యాదగిరి (నక్కల కుల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ )
చిన్న ముత్యంపేట గ్రామ ప్రజలు