భారత్ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నవ యుగ యుద్ధంలో పాకిస్థాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు.
ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ మొదలయ్యాక జాతినుద్దేశించి ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటిచెప్పారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే.. వారి ముఖ్యమైన మౌలికవసతులు, ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి.. కుటుంబసభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్థాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికిపైగా పేరుమోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమేనని స్పష్టంచేశారు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంతపెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని పాక్కు తేల్చిచెప్పారు.
సైనిక శౌర్య పరాక్రమాలకు సెల్యూట్
‘‘అన్నింటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నా. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నా. పహల్గాంలో ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్నవారిని మతం అడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ఠ. దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నించారు. ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదంపట్ల కఠినంగా వ్యవహరించాలని నినదించింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాతే మేం భారత సేనలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం. మన సోదరీమణులు, బిడ్డల నుదుటి సిందూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థలకు దాని పర్యవసానం ఏమిటో తెలిసి వచ్చింది.
కోట్ల మంది మనోభావనల ప్రతిబింబం
ఆపరేషన్ సిందూర్ కేవలం పేరుకాదు. కోట్ల మంది ప్రజల మనోభావనల ప్రతిబింబం. న్యాయం కోసం అఖండ ప్రతిజ్ఞ. భారతీయ సేన పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేసింది. భారత్ ఇంతపెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద సౌధాలతోపాటు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాయి. బహావల్పుర్, మురీద్కేలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా అందులో వీటిపాత్ర ఉంటోంది. 9/11 సహా దేశంలో దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్దపెద్ద ఉగ్రవాద దాడులన్నీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరం తుడిచేస్తూ వచ్చారు. అందుకే ఆ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని సైన్యం ధ్వంసం చేసింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చారు. ఒక్క దెబ్బతో వీరిని సైన్యం తుడిచిపెట్టింది.
బిత్తరబోయిన పాక్
భారత్ కార్యాచరణను చూసి పాకిస్థాన్ పూర్తి నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. ఒక రకంగా బిత్తరపోయింది. ఈ తత్తరపాటులో మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు పలకడానికి బదులుగా భారత్పైనే దాడిచేయడం మొదలుపెట్టింది. మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, ఆలయాలు, సామాన్య ప్రజల ఇళ్లను, మన సైనిక స్థావరాలనూ లక్ష్యంగా చేసుకుంది. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు ఎలా గడ్డిపోచల్లా గాల్లో కలిసిపోయాయో ప్రపంచం చూసింది. పాకిస్థాన్ చాలా గర్వంగా భావించే వైమానిక స్థావరాలను మన సైన్యం పూర్తిగా దెబ్బతీసింది. ఆ నష్టాన్ని ఊహించడం కష్టం. అందుకే బయటపడే మార్గం కోసం పాకిస్థాన్ వెదికింది. ప్రపంచం మొత్తం తిరిగి అందర్నీ ప్రాధేయపడింది. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్థాన్ సైన్యం మన డీజీఎంవోని సంప్రదించింది. ఆలోపే మనం పాకిస్థాన్లోని మొత్తం మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాం. ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం. అందుకే తమవైపు నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్థాన్ చెప్పింది. భారత్ కూడా వాటిని పరిగణనలోకి తీసుకుని ఆలోచించింది.
యుద్ధ మైదానంలో మనం ప్రతిసారీ పాకిస్థాన్ను మట్టి కరిపించాం. ఆపరేషన్ సిందూర్ రూపంలో ఎడారులు, పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రదర్శించాం. ఈ ఆపరేషన్ ద్వారా ‘భారత్లో తయారీ’ ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్ధానిది కాదు… ఉగ్రవాదులదీ కాదు. దేశ ప్రజలారా! ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతిమార్గం చూపారు. శాంతి మార్గం కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది. వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరం. అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్ ఇదే చేసింది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్ మాతాకీ జై’ అని మూడుసార్లు నినదించి 22 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు.
ఆ దేశం వేసే ప్రతి అడుగునూ పరిశీలిస్తాం
మనం ఇప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై దాడులను నిలిపేశాం. రాబోయే రోజుల్లో ఆ దేశం ప్రతి అడుగునూ, ప్రతి ఆలోచననూ పరిశీలిస్తాం. దళాలన్నీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. మెరుపుదాడులు, గగనతల దాడుల తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ విధానం ఇదే. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఆపరేషన్ సిందూర్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. భారత్పై ఉగ్రవాదానికి పాల్పడితే మూతి పగులగొట్టేలా గట్టి సమాధానం ఇస్తాం. మన సొంత మార్గంలో, స్వీయ నిబంధనల ప్రకారం స్పందిస్తాం. ఉగ్రవాద మూలాలు బయటపడే ప్రతిచోటా కఠిన చర్యలు తీసుకుంటాం. అణుబాంబు బెదిరింపుల్ని భారత్ సహించదు. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుంది. ఉగ్రవాద తండాలను, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని భారత్ విడివిడిగా చూడదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం మొత్తం పాకిస్థాన్ వాస్తవ ముఖచిత్రాన్ని చూసింది. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆ దేశం ఉన్నతాధికారులు పాల్గొనడం.. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి ప్రబల సాక్ష్యం. భారత్ తన ప్రజలను కాపాడుకోవడానికి నిరంతరం భారీ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంతపెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోం.పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు, ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే.