ఉద్రిక్తతలను ఆపకుంటే వాణిజ్యం నిలిపేస్తామంటూ భారత్, పాక్ ను హెచ్చరించామని, అందుకే కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఆపరేషన్ సిందూర్ నడుస్తున్న సమయంలో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్ లో మాట్లాడిన మాట వాస్తవమే కానీ.. అప్పుడు ఎక్కడా వాణిజ్య ప్రస్తావన రానేలేదని భారత్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి అసలు సంబంధమే లేదని భారత్ తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ గురించి మే 9 న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో, విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో మే 8,10 తేదీల్లో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారని భారత అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మే 10 న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ మాట్లాడారని, ఈ సందర్భంలో వాణిజ్య ప్రస్తావనే రాలేదని భారత్ తేల్చి చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే..
భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దీనికి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలను ఆపకుంటే వాణిజ్యం నిలిపేస్తామంటూ ఇరు దేశాలకూ స్పష్టం చేశానని, అందుకే ఆ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.