పాకిస్తాన్లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకుని దాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు భారతదేశాన్ని జఫర్ సహితో అభినందించారు. ఆయన జియే సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ (జెఎస్ఎఫ్ఎం) అధ్యక్షుడు. పాకిస్తాన్ నుంచి సింధ్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న ఉద్యమం అది. భారత్ను అభినందించే ప్రకటనతో పాటు ఆయన ఒక బహిరంగ లేఖ రాసారు. దాని శీర్షిక ‘ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యం పాకిస్తాన్ నుంచి సింధీల హక్కులు, స్వీయ నిర్ణయాత్మకత కోసం అంతర్జాతీయ సమాజానికి వినతి’. అందులో జెఎస్ఎఫ్ఎం తమ దేశాన్ని అస్థిరపరిచే విధానాల విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది.
ఉగ్రవాదానికి ప్రతిగా భారత్ నిర్ణయాత్మక దాడి:
ఉగ్రవాద బృందాలకు ఆశ్రయమిచ్చి, వారికి అండగా నిలిచిన పాకిస్తాన్ మిలటరీ బేస్లు, ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి భారతదేశం అత్యంత ఆధునిక సాంకేతికతను, కచ్చితమైన నిఘా సమాచారాన్నీఉపయోగించడాన్ని జఫర్ సహితో ప్రశంసించారు. ‘‘ఎంతో ధైర్యంగా, ప్రభావశీలంగా చేసిన దాడులు భారతదేశపు బలాన్ని, నిర్ణయాత్మకతను, తన పౌరులను రక్షించుకుంటూ ఉగ్రవాదులను శిక్షించడంలో భారత్ చూపిన నిబద్ధతనూ తెలియజేసాయి’’ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలను చావుదెబ్బ తీసింది, ఫలితంగా పాకిస్తాన్ ప్రపంచ దేశాలు – ముఖ్యంగా అమెరికా – ఒత్తిడితో, కాల్పులను నిలిపివేసి, చర్చలు జరపడానికి అంగీకరించింది.
ఆపరేషన్ సిందూర్ వల్ల ప్రాదేశిక భద్రతలో కలిగే విస్తృతస్థాయి పరిణామాలను వివరిస్తూ… ‘‘అమాయకులను చంపేవారు, వారి యజమానులు, వారికి ఆశ్రయం కల్పించేవారు, వారికి నిధులు సమకూర్చే వారూ ఆ చర్యలకు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భారత్ చర్యలు స్పష్టమైన సందేశాన్నిచ్చాయి’’ అని సహితో స్పష్టం చేసారు.
జెఎస్ఎఫ్ఎం ప్రకటన, ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి భారతదేశపు నాయకత్వం అవసరాన్ని వివరించింది. పాకిస్తానీ పంజాబ్ ఆధిక్యం కలిగిన సైనిక పాలనలో సుదీర్ఘకాలంగా కష్టనష్టాల పాలవుతున్న సింధీ జాతి ఆ అంశానికి బాగా కనెక్ట్ అయింది.
సింధీల సంఘీభావం – చారిత్రక సందర్భం:
చారిత్రక సింధీ జాతీయులుగా తాము ఎదుర్కొన్న ఘర్షణలకూ, ఉగ్రవాదంపై భారత్ పోరుకూ సామ్యాలు చూసిన జెఎస్ఎఫ్ఎం, భారతదేశానికి సంఘీభావం ప్రకటించింది. ‘‘పాకిస్తాన్ మిలటరీ పాలనలో మేము కూడా చాలాకాలం కష్టాల పాలయ్యాం. ఆ పాలనలో పంజాబ్ ఆధిక్యం ఎక్కువ. రాడికల్ ఇస్లామిక్ శక్తులు, చైనా వంటి బాహ్య శక్తుల కలయిక మరింత ప్రమాదకరమైనది’’ అని సహితో చెప్పారు.
పాకిస్తాన్లో సైనిక పరిపాలనలో బలోచ్, పష్తూన్, సరైకీ వంటి తెగలతో పాటు సింధీయులు కూడా వ్యవస్థీకృత అణచివేత, దోపిడీ, హింసాకాండల బాధితులుగా నిలిచారు.
జెఎస్ఎఫ్ఎం రాసిన లేఖ, చరిత్రాత్మకమైన ‘సప్త సింధు’ ప్రాంతం అంతటినీ పాకిస్తాన్ ఆక్రమించేసిందంటూ తమ భూమి తమకే కావాలన్న వాదనను తెర మీదకు మరోసారి తెచ్చింది. సింధీ, బలోచ్, పష్తూన్, సరైకీ తెగల సాంస్కృతిక, చారిత్రక సేవలను గుర్తు చేసింది. ‘‘సింధీ, బలోచ్, పష్తూన్, సరైకీ తెగల ప్రజల నేపథ్యాలనూ, వారు దేశానికి అందించిన సేవలనూ విస్మరించజాలము’’ అని స్పష్టం చేసింది. స్వీయ నిర్ణయాత్మకతకు తమకున్న హక్కును గుర్తించాలని కోరింది.
అంతర్జాతీయ సమాజానికి అత్యవసర వినతులు:
ప్రపంచ శక్తులకు, అంతర్జాతీయ సంస్థలకు జెఎస్ఎఫ్ఎం పలు వినతులు చేసింది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలనీ, అణచివేయబడిన తమ జాతుల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతివ్వాలనీ కోరింది. వారి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి….
(1) అమెరికా దాని మిత్రపక్షాలకు: ‘‘పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలను శాశ్వతంగా నిర్వీర్యం చేయాలి. ఉగ్రవాదాన్ని ప్రచారం చేసే మిలటరీ రాజ్యం చేతుల్లో అలాంటి అణ్వాయుధాలు ఉండడం ప్రాదేశిక, ప్రపంచ భద్రతకు ప్రమాదకరమైన ముప్పు.’’
(2) ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు: ‘‘తక్షణమే అన్ని రకాల సహాయాలు, ఋణాలు, ఇతరత్రా సహకారమూ అందించడం నిలిపివేయండి. ఆ నిధులను ఒక పద్ధతి ప్రకారం ఉగ్రవాదాన్ని మళ్ళిస్తున్నారు. దేశ అంతర్గత అసంతృప్తులను అణచివేస్తున్నారు పొరుగు దేశాలను అస్థిరపరుస్తున్నారు.’’
(3) ప్రపంచంలోని ప్రజజస్వామిక దేశాలకు: ‘‘పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న సింధీలు, బలోచ్లు, పష్తూన్లు, సరైకీలు తమ చారిత్రక సార్వభౌమత్వాన్ని కోరుకుంటున్నారు. స్వేచ్ఛ, శాంతి కావాలనుకుంటున్నారు. పాక్ అణచివేస్తున్న ఆ దేశాలకు స్వయం నిర్ణయాధికారానికి ఉన్న హక్కును గుర్తించండి.’’
(4) ఆ లేఖ ఒక ప్రతిపాదన కూడా చేసింది. పాకిస్తాన్ అణచివేతకు గురవుతున్న ప్రదేశాలన్నీ ఒక ప్రాంతీయ కేంద్రంగా ఏర్పడాలి. ఆ కేంద్రానికి భారత్ నాయకత్వం వహించాలి. చారిత్రక, నాగరిక సంబంధాల కారణంగా భారత్ నాయకత్వాన్ని అందరూ అంగీకరిస్తారు. ‘‘భాష, జాతి, సంస్కృతి ఆధారంగా స్వీయ నిర్ణయాధికారాన్ని ప్రకటించుకునే చట్టబద్ధమైన హక్కును పొందేందుకు మాకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సహితో పేర్కొన్నారు.
జెఎస్ఎఫ్ఎం అధినేత ఏం చెప్పారంటే….
‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ప్రత్యేకించి ఈమధ్య జరిగిన ఆపరేషన్లు చాలావరకూ చైనా వల్ల తలెత్తినవే. పాకిస్తాన్ మీద చైనా తన ప్రభావం చూపిస్తోంది. ఈ ఘర్షణ భారత్-పాక్ వ్యవహారం మాత్రమే కాదు. అది భారత్-చైనా ఘర్షణగా ముదురుతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’’.
‘‘ప్రస్తుతం పాకిస్తాన్లోని అతివాద మతగురువులు ప్రతీ నగరంలోనూ ఆందోళనలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు బహిరంగంగానే హింసాకాండకు పిలుపునిస్తున్నారు. గత నాలుగైదేళ్ళలో జరిగిన పరిణామాలు దేశపు, ముఖ్యంగా సైన్యపు, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసాయి. ఇమ్రాన్ఖాన్ పాలనాకాలంలో కంటోన్మెంట్ల మీద దాడులు జరుగుతుండేవి. బలోచిస్తాన్, సింధ్, తదితర ప్రాంతాల్లో సంఘర్షణలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ యుద్ధం వారి నైతిక స్థైర్యాన్ని మరింత పెంచింది.’’
‘‘సింధ్ ప్రాంతంలో ఏదైనా ఉద్యమం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్ మీద గణనీయంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సింధ్ వెన్నెముక వంటిది. దేశం ఆదాయంలో 75 నుంచి 80 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. కాబట్టి ముందు ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలి. పంజాబ్ను ఐదు నదుల ప్రాంతం అనడానికీ, పాకిస్తాన్ను సప్త సింధు అనడానికీ మూలకారణం మా సింధ్ ప్రాంతమే. మా వరకూ మాకు సింధు అనేది మా సంస్కృతి. భారతదేశంతోనూ, సనాతన ధర్మంతోనూ సుసంపన్నమైన సంస్కృతి మా సొంతం. ఈ ఉగ్రవాద దేశం నుంచి మేము మా గొప్ప వారసత్వాన్ని మళ్ళీ సాధించుకోవాలి.’’
‘‘పాకిస్తాన్ దుష్ట బుద్ధి ఎప్పటికీ మారదు. నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళు సుమారు ఏడుగురు ఉగ్రవాదులను బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి భారత్లోకి పంపించారు. పాకిస్తాన్లోని ఈ 12 కోట్ల జనాభాని ఎంతగా అతివాదులుగా మార్చేసారంటే, వాళ్ళు జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరుతో ఆత్మాహుతి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.’’
సహితో చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. ‘‘మేము భారతదేశంతో ఉండాలి అనుకుంటున్నాము. కేవలం బలోచిస్తాన్కే కాదు, మాకు కూడా విముక్తి కావాలి. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మా స్వతంత్ర ప్రయత్నాలకు అండగా నిలవడానికీ భారతదేశం ఒక వ్యూహాన్ని అమలు చేసేందుకు వీలుగా సిద్ధపడాలి.’’
‘‘కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రాంతంలో మూడు నుంచి ఐదు ఇళ్ళను తగులబెట్టేసింది. అవి ముస్లిముల ఇళ్ళనీ, వాళ్ళ మీద భారత్ ఉగ్రవాదులు అన్న ముద్ర వేసి తగలబెట్టేసిందనీ పాకిస్తాన్ ఇక్కడ ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ వాస్తవాలను మార్చేసే కథన పద్ధతి (నెరేటివ్) అది. సామాజిక మాధ్యమాలు, మీడియా సంస్థలు, వీడియో కథనాల మీద పాకిస్తాన్ దృష్టి సారించాలి. అవి చాలా ప్రమాదకరమైనవి. వాటిని విస్మరించకూడదు’’ అని జఫర్ సహితో చెప్పారు.
సింధ్లో హిందువుల ఊచకోత –మానవ సంక్షోభం:
పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సిపి) జనవరి 2025 నివేదిక పేరు ‘‘హిందూ సమాజం సింధ్ను విడిచి పెట్టేస్తోందా?’’. ఆ నివేదిక పాకిస్తాన్లో హిందువులు, ఇతర మత మైనారిటీల వ్యవస్థీకృత నిర్మూలన గురించి వివరంగా వెల్లడిస్తుంది. 2025 జనవరి 23న విడుదలైన ఆ నివేదిక… పాకిస్తాన్లో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితి, ఇస్లామిక్ హింసాకాండ, ఆర్థిక సవాళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్తాన్లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్ ప్రొవిన్స్ నుంచి హిందువులు వలస పోతుండడం గురించి వివరించింది.
హెచ్ఆర్సిపి నివేదిక, హిందువుల వలసలకు మూలాలను చారిత్రక సంఘటనల్లో చూపించింది. 1986లో సుక్కూరులో హిందూ వ్యాపారులను కిడ్నాప్ చేసిన నేరంలో దోషులుగా నిరూపణ అయిన 34 మంది, జైలును బద్దలుగొట్టి పారిపోయిన ఘటన భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.
1992లో భారతదేశంలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత పాకిస్తాన్లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. గుడులు, ప్రార్థనా స్థలాల మీద దాడులు పెచ్చుమీరిపోయాయి. ‘‘భారతదేశంలో సంఘటనలు పాకిస్తాన్లో హింసాకాండ పెరగడానికి ఉత్ప్రేరకంగా మారాయి. దాంతో పాకిస్తానీ హిందువులు భారత్కు వలస పోవడం ట్రెండ్గా మారింది’’ అని ఆ నివేదిక చెప్పింది.
పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న తాజా హింసాకాండను హెచ్సిఆర్పి నివేదిక పొందుపరిచింది. డబ్బుల కోసం కిడ్నాప్లు, బలవంతపు మతమార్పిడులు, లక్షిత దాడులూ వాటిలో ప్రధానమైనవి. ‘‘నదీ ప్రాంతాల దగ్గర ఉండే దోపిడీ దొంగల ముఠాలు డబ్బుల కోసం కిడ్నాప్లు చేయడం పెరిగిపోవడంతో హిందువులు భయపడిపోతున్నారు’’ అని ఆ నివేదిక పేర్కొంది. దానికి నిదర్శనంగా ఘోట్కీ, జకోబాబాద్, కష్మోర్ వంటి ఉత్తర సింధు జిల్లాల్లో హిందూ నాయకుల ఇంటర్వ్యూలను ఉటంకించింది. ధనవంతులైన హిందువులు, ప్రత్యేకించి అగ్రవర్ణాల వారిని వారి మతపరమైన ఉనికి, ఆర్థిక స్థాయి ఆధారంగా లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయా ముఖాముఖీల ద్వారా తెలుస్తోంది.