పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో నేలకూల్చేసింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ద్వారా ఎన్నుకున్న అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రువుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు సైతం తెలిపాయి.
పాక్తో జరిగిన యుధ్ధంలో ఒక్కొక్క గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్లో దాదాపు 150 నుండి 200 మంది చొప్పున మొత్తం 3 వేల మంది అగ్నివీరులు ఈ ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నారని ఆర్మీవర్గాలు తెలిపాయి. వీళ్లందరూ కూడా సరిహద్దుల్లో పలు కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్బేస్లలో విధులు నిర్వహించారు. ఉద్రిక్తతల సమయంలో సాధారణ సైనికుల్లాగే ముందుండి పోరాడారు అగ్నివీరులు. కేవలం అదిమాత్రమే కాకుండా పాకిస్థాన్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్లను ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూ సమర్థంగా విధులు నిర్వహించారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణుల గన్స్ అమర్చినటువంటి భారీ వాహనాలకు డ్రైవర్లుగా కూడా అగ్నివీరులు పనిచేశారు. అయితే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అగ్నివీర్ పథకం పై అప్పట్లో చాలామంది ఉద్దేశ్యపూర్వకంగా ఎంతో తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచారాలన్నీ అసత్యాలే అని ఇప్పుడు జరిగిన యుద్ధంలో అగ్నివీరుల వీరత్వం వల్ల వెల్లడైంది. ఈ సందర్భంగా అసలు ఈ పథకం గురించి సంపూర్ణ సమాచారం మీకోసం....
అగ్నివీరుల ఎంపిక ఎలా?
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతకు, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ‘అగ్నిపథ్ పథకం తోడ్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్లో అత్యధికం వేతనాలు, ఫించన్లకే పోతోంది. ఈ భారాన్ని తగ్గించడం ద్వారా మిగులు నిధులను రక్షణ రంగ ఆధునీకరణకు కేటాయించడం అగ్నిపథ్లో ఒక భాగం మాత్రమే..
అగ్నిపథ్ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారిని ‘అగ్నివీర్’లు అంటారు. అగ్నిపథ్ సర్వీసులో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. వీరి సేవాకాలం మొత్తం నాలుగేళ్లు. ఆరు నెలలు శిక్షణ తర్వాత మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. మొత్తం నాలుగేళ్ల సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి. నాలుగేళ్ల సర్వీసు అనంతరం సైన్యం అగ్నివీర్లకు ఏకమొత్తంగా రూ.11.71 లక్షల నిధి (పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.
భవిష్యత్ అవకాశాలు ఎలా ఉంటాయంటే?
ఈ పథకం నాలుగేళ్ల కాంట్రాక్టుదే అయినా అగ్నివీర్ల మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అగ్నిపథ్లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ ఇస్తారు. దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
అగ్నిపథ్లో నాలుగేళ్ల సర్వీసు అనంతరం ‘అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్’తో పాటు తదుపరి ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. సీఏపీఎఫ్(CAPF), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. స్వయం ఉపాధి కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. మొత్తం మీద అగ్నివీర్ల భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. వీరి భవిష్యత్తు అగమ్యగోచరం అనే వాదనలో వాస్తవం లేదు. అగ్నిపథ్ కారణంగా వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతారు. తద్వారా సాయుధ బలగాల బృందం సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది.
సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుందా?
సైన్యంలో అగ్నిపథ్ తరహా స్వల్పకాలిక నియామక విధానం ప్రపంచంలో పలు దేశాలలో ఉంది. శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమం.. . మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల సైనిక బలగాలు యువతపైనే ఆధారపడుతున్నాయి. ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. సుదీర్ఘ కాలంలో యువకులు, నైపుణ్య పర్యవేక్షక అధికారులు 50%-50% ఉండేలా చేస్తుంది.
అగ్నివీరులు సర్వీసు పూర్తయ్యాక సమాజంలోని వస్తే ప్రమాదకరులవుతారని, ఉగ్రవాదులతో చేతులు కలుపుతారంటూ దారుణమైన తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలు పూర్తిగా అపోహ మాత్రమే... ఇలాంటి వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమే అవుతుంది. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారతమాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు తప్ప నిస్సందేహంగా దేశానికి ద్రోహం ఎంతమాత్రం చేయరు. ప్రస్తుతం ప్రతి ఏటా వేలాది సైనికులు పదవీ విరమణ పొందుతున్నారు. ఇటీవల పాక్ లో జరిగిన యుద్ధంలో వీరమరణం కూడా పొందారు. అలా గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు సైన్యంలోకి దాదాపు లక్షమంది అగ్నివీరులను తీసుకున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు.
మన యువత జీవిత ఆరంభంలో నాలుగేళ్లపాటు దేశ రక్షణ కోసం పని చేసి మంచి ప్యాకేజీతో సైన్యం నించి బయటకు వచ్చి, భావి జీవితాన్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇంకేదైనా నచ్చిన వృత్తి, వ్యాపారం కొనసాగించేందుకు చక్కని అవకాశం కల్పిస్తోంది అగ్నిపథ్. ఇక ఇప్పటికైనా ఈ పథకంపై రాజకీయ విమర్శలు చేయడం ఆపితే బాగుంటుంది. ఎవరైనా ఈ పథకంపై దుష్ప్రచారం చేస్తే ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది.