ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం - 23 సెప్టెంబర్‌, 1918 - Battle of Haifa September 23, 1918

Vishwa Bhaarath
0
ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం - 23 సెప్టెంబర్‌, 1918 - Battle of Haifa September 23, 1918
Battle of Haifa
సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
   ఈ యుద్ధం తరువాత బ్రిటిష్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సేనలతో కలిసి పోరాడిన భారతీయ సైనికులు మొత్తం ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇజ్రాయిల్‌లో జరిగిన వివిధ పోరాటాల్లో 900 పైగా భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఇప్పటికీ వారి సమాధులను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం పరిరక్షిస్తోంది. ప్రతి సంవత్సరం 23 సెప్టెంబర్‌ను భారతీయ సైనికుల స్మృతి దినంగా పాటిస్తారు. వారి బలిదానాల గురించి పాఠశాలల్లో పిల్లలకు చెపుతారు. పాఠ్య పుస్తకాల్లో కూడా వారి విజయగాథలు చేర్చారు. భారత సేనలకు నాయకత్వం వహించిన మేజర్‌ దలపత్‌సింగ్‌ షెకావత్‌ను ‘హైఫా హీరో’గా గుర్తిస్తారు. ఆ యుద్ధంలో ఆయన చనిపోయినప్పటికీ సైనికులు మాత్రం వెనకడుగువేయకుండా భారత్‌కు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టారు.

హైఫా యుద్ధ గుర్తుగా 'ఇజ్రాయెల్' వారు భారతీయ సైనికుల త్యాగానికి గుర్తుగా ముద్రించిన తపాలా బిళ్ళ.
ప్రపంచ చరిత్రలో ఇది చాలా అరుదైన, చెప్పుకోదగిన యుద్ధంగా నిలిచిపోయింది. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సైన్యం తమ భూభాగంలో సురక్షితంగా ఉంది. ఆ సేన దగ్గర తుపాకులు, ఫిరంగులు మొదలైన ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. మరోవైపు జోధ్‌పూర్‌, మైసూర్‌లనుండి వెళ్ళిన భారతీయ సైనికులు ప్రధానంగా అశ్వికులు. కొద్దిమంది సాధారణ కాలిబంటులు. వారి దగ్గర కత్తులు, బల్లాలు తప్ప ఆధునిక ఆయుధాలు లేవు. ఇలా కత్తులు, బల్లాలతో కొద్దిమంది సైనికులు ఆధునిక ఆయుధాలు కలిగిన అపారమైన సైన్యాన్ని ఓడించడం ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. అలాగే ఇలాంటి యుద్ధం జరగడం కూడా ఇదే ఆఖరుసారి. కనుక ఇలాంటి అపూర్వమైన యుద్ధం ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుంది. హైదరాబాద్‌ నిజాం కూడా బ్రిటిష్‌ సేనలకు సహాయంగా అశ్వికదళాన్ని పంపాడు. కానీ ఆ దళానికి యుద్ధంలో పట్టుకున్న శత్రుసైనికులను చూడటమే వారి పని. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు.

హైఫా యుద్ధం
హైఫా విజయం ప్రాముఖ్యత
హైఫా ఇజ్రాయిల్‌ నౌకా పట్టణం. క్రీ.శ 1516లో టర్క్‌ ఒట్టమాన్‌లు దీనిని ఆక్రమించి 402 ఏళ్ళపాటు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. హైఫా లేకుండా, సరైన రోడ్డు మార్గాలు లేకుండా సైనిక దళాల కదలిక సాధ్యం కాదని బ్రిటిష్‌ అధికారులకు అర్థమైంది. అందుకనే 1918 సెప్టెంబర్‌ 22న బ్రిగెడియర్‌ జనరల్‌ కింగ్‌ యుద్ధశకటాలను తీసుకుని నజరత్‌ మార్గం గుండా హైఫా చేరుకోవాలని ప్రయత్నించాడు. కానీ పర్వత సానువుల నుండి టర్క్‌లు వారిపై గుళ్ళవర్షం కురిపించారు. దానితో బ్రిటిష్‌ సేనలు వెనక్కి తగ్గక తప్పలేదు.

భారతీయ సైనికుల ప్రతిస్పందన
జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన రెండు అశ్వికదళాలలోని సైనికులకు ఇలా వెనక్కి తగ్గడం ఏమాత్రం నచ్చలేదు. అశ్వికదళాలకు నేతృత్వం వహిస్తున్న మేజర్‌ దలపత్‌ సింగ్‌ షెకావత్‌కు ఇది చాలా అవమానమనిపించింది. అయితే శత్రువులు సురక్షితమైన, కీలక ప్రదేశాలను ఆక్రమించుకుని ఉన్నారని, వారి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయని వీరికి నచ్చచెప్పాలని బ్రిటిష్‌ అధికారులు ప్రయత్నించారు. కానీ మహారాజా సైనిక దళాల పట్టుదలను చూసి ఎదురుదాడికి అనుమతిని ఇచ్చారు.

23 సెప్టెంబర్‌, 1918 – హైఫా యుద్ధం - ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో భారతీయ పరాక్రమం
జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన అశ్వికదళంవద్ద కేవలం కత్తులు, బల్లాలు మాత్రమే ఉన్నాయి. అయినా వాటితోనే దళాలు 23 సెప్టెంబర్‌,1918 హైఫా పట్టణం వైపు సాగాయి. సైనికులు కిషోన్‌ నది, దాని కాలువల వెంబడి చిత్తడి నేలలో కార్మెల్‌ పర్వత సానువుల వెంబడి ముందుకు కదిలారు. ఇలాంటి ప్రదేశంలో అశ్వదళం కదలడమే చాలా కష్టం. వాళ్ళు దాదాపు 10 గంటలకు హైఫా పట్టణానికి చేరుకుంటున్నప్పుడు కార్మెల్‌ పర్వత సానువుల నుండి 77 ఎం.ఎం ఫిరంగులు ఒక్కసారి వారిపై విరుచుకుపడ్డాయి. హైఫా పట్టణంలోనేకాక చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా టర్క్‌లు జర్మన్‌లు, ఆస్ట్రియా దళాలు సమకూర్చిన ఫిరంగులను మొహరించారు.
 మైసూరు అశ్విక దళం (వీరితోపాటు షెర్‌వుడ్‌ దళం కూడా ఉంది) దక్షిణం వైపు నుంచి కార్మెల్‌ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. శత్రువును ఆశ్చర్యపరుస్తూ ఆ దళం రెండు నావికాదళ ఫిరంగులను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు శత్రువు కురిపిస్తున్న మిషన్‌గన్‌ కాల్పులకు ఎదురువెళ్ళారు. 
  అప్పుడే మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో జోధ్‌పూర్‌ అశ్వదళం బ్రిటిష్‌ సేనతోపాటు హైఫాను ముట్టడించింది. అన్ని వైపుల నుండి జరుగుతున్న మెషిన్‌గన్‌ కాల్పులను లెక్కచేయకుండా వాళ్ళు శత్రువుపై విరుచుకుపడ్డారు.  ఆ తరువాత ఒక గంట లోపు భారతీయ అశ్వసైనికులు ఒట్టమాన్‌ల నుండి హైఫాను స్వాధీనం చేసుకున్నారు. వారి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
   ఆనాటి భారతీయ దళాల యుద్ధనైపుణ్యం, పోరాట పటిమ గురించి ప్రపంచయుద్ధపు అధికారిక చరిత్ర – మిలటరీ ఆపరేషన్‌ ఇన్‌ ఈజిప్ట్‌లో (2వ సంపుటం) ఇలా వివరించారు – ”ఈ మొత్తం యుద్ధంలో భారత అశ్వదళం చూపిన పరాక్రమం మరెక్కడా కనిపించదు. మెషిన్‌గన్‌ కాల్పులు కూడా అశ్వదళపు మెరుపుదాడిని అడ్డుకోలేకపోయాయి. కాల్పులకు ఎదురొడ్డి గుర్రాలను నడపడం మరెక్కడా చూడం. యుద్ధం తరువాత చాలా గుర్రాలు చని పోయాయి.” ఇలా ముందుకురికిన అశ్వదళం ఒక దుర్భేద్యమైన పట్టణాన్ని సైతం స్వాధీన పరచు కోవడం మిలటరీ చరిత్రలో మరెక్కడా కనిపించదు.

హైఫా హీరో మేజర్‌ ఠాకూర్‌ దలపత్‌ సింగ్‌కు నివాళి
మేజర్‌ షెకావత్‌ సాధించిన అపూర్వమైన విజయానికిగాను బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు అత్యుత్తమ సైనిక పురస్కారం ‘మిలటరీ క్రాస్‌’ను (ఇప్పటి పరమవీర చక్రకు సమానం) ఇచ్చింది. దలపత్‌ సింగ్‌ స్మృత్యర్థం మేవార్‌ ప్రభుత్వం ప్రతాప్‌ పాఠశాల ఆవరణలో ‘దలపత్‌ స్మృతి మందిరం’ నిర్మించింది. మహారాజా ఉమేద్‌ సింగ్‌ ప్రత్యేక వెండి నాణాలు విడుదల చేయించారు. అవి ఇప్పటికీ జోధ్‌పూర్‌ 61 అశ్వదళ కేంద్రంలో ఉన్నాయి.

ఇతర హైఫా యుద్ధవీరులు
కెప్టెన్‌ అనూప్‌ సింగ్‌, సెకెండ్‌ లెఫ్టినెంట్‌ సాగత్‌ సింగ్‌ లకు కూడా మిలటరీ క్రాస్‌ లభించింది. కెప్టెన్‌ బహదూర్‌ అమన్‌సింగ్‌ జోధా, దఫాదార్‌ జోర్‌ సింగ్‌లకు ఇండియన్‌ ఆర్టర్‌ ఆఫ్‌ మెరిట్‌ లభించింది. బ్రిటిష్‌ రాణి భారతీయ సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం మిలటరీ క్రాస్‌. ఇది ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పరమ్‌ వీర్‌ చక్ర వంటిది.

మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top