కంచి కామకోటి పీఠంలో శిష్య స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అక్షయ తృతీయ పర్వదినం (బుధవారం) రోజున ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు బ్రహ్మచారి అయిన శ్రీ దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ కి సన్యాస దీక్ష ఇచ్చి అనుగ్రహించారు.
మొదటగా శంకర విజయేంద్రులు, బ్రహ్మచారి ఇద్దరూ ఆలయ కోనేరు దగ్గరికి చేరుకున్నారు. తదనంతరం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతుల సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో సన్యాస దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది.తదనతరం ‘‘సన్యస్తం మయ.. సన్యస్తం మయ.. అంటూ చేతులు పైకి లేపి... సన్యాసం తీసుకుంటున్నట్లు పంచ భూతాలు, కామాక్షి అమ్మ, విజయేంద్ర సరస్వతుల సాక్షీగా సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రమాణం చెప్పారు. ఆ తర్వాత కోనేరు వద్ద వేద మంత్రాల మధ్య బ్రహ్మచారి సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ తన శిఖను త్యజించారు. ఆ తర్వాత చెవులకుండే పోగులను తీసేశారు. తదనంతరం సూర్యాభిముఖంగా వుండి యజ్ఞోపవీతాన్ని కూడా కోనేరులో త్యజించారు.
తదనంతరం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు బ్రహ్మచారి సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ ద్రావిడ్ కి సన్యాస దీక్ష వస్త్రాలు (కాషాయ వస్త్రాలు) ఇచ్చారు. ఈ సమయంలో ‘‘త్రాహిమాం సర్వ లోకేష.. వాసుదేవ సనాతన.. సన్యస్తమే జగద్యోనే.. పుండరీకాక్ష మోక్షదా...త్రాహిమాం పురుషోత్తమ’’ అన్న వేద మంత్రాలను పఠించారు. తదనంతరం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు బ్రహ్మచారికి సన్యాస దీక్షాలు (కాషాయ వస్త్రాలు) ఇచ్చారు. తర్వాత బ్రహ్మచారి సన్యాస దీక్ష వస్త్రాలు ధరించి, పూర్తి సన్యాసిగా మారిపోయారు.
తదనంతరం శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వాముల కరకమలముల మీదుగా దండాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఉభయ గురుదేవులూ భక్తులకు దర్శనమిచ్చారు. తదనంతరం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు ఉత్తరాధికారికి ‘‘శ్రీ సత్య చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహా స్వామి’’ అన్న యోగ పట్టాను అనుగ్రహించారు. తదనంతరం శంకర విజయేంద్రులు బాల స్వామికి మహా వాక్యాలను అనుగ్రహించారు. తర్వాత బాల స్వామి తలపై సాలగ్రామను వుంచి, విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు అభిషేకం చేశారు.
తదనంతరం ఉభయ జగద్గురువులూ కంచి పీఠం అధిష్ఠాన దేవత అయిన కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తదనంతరం కంచి పీఠాధిపతుల అనుష్ఠానాలనూ దర్శనం చేసుకున్నారు. తదనంతరం వేద పఠనం, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన పండితులు భిక్షా వందనం చేశారు.
సన్యాస దీక్ష సందర్భంగా కంచి పురాన్ని, పీఠం పరిసరాలను అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూల మాలలు, లైట్లతో పీఠం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ఆ శిష్య స్వీకార మహోత్సవాన్ని తిలకించడానికి భారత దేశం నలుమూలల నుంచీ కంచిపీఠం అనుయాయులు, భక్తులు భారీగా తరలివచ్చారు.