టర్కీ, అజర్ బైజాన్ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్త బహిష్కరణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్వదేశీ జాగరణ్ మంచ్ స్పందించింది. టర్కీ, అజర్ బైజాన్ బాయ్ కాట్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు వుంటుందని ప్రకటించింది.
ఈ మేరకు ఈశాన్య ప్రాంతంలోని స్వదేశీ జాగరణ్ మంచ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ రెండు దేశాలతో అన్ని ప్రయాణాలు, వాణిజ్యాన్ని నిలిపేయాలని కోరింది. ఈ దేశాలను బహిష్కరించడంలో ఈశాన్య భారతం దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా అండగా నిలుస్తుందని జాగరణ్ మంచ్ ప్రతినిధులు పేర్కొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారం మరియు భద్రతా సమస్యలను గౌరవించే వరకు ఈ దేశాలతో ప్రయాణం మరియు వ్యాపారాన్ని బహిష్కరించాలని, అన్ని ప్రాంతాల ప్రజలు ఇందుకు సహకరించాలని కోరింది.
ఇక.. టర్కీలో తయారైన రెడీమెడ్ దుస్తులను భారత్ లో దిగుమతి చేసుకోవద్దని సూచించింది. జారా, అడిడాస్, నైక్ వంటి పెద్ద పెద్ద విదేశీ రెడీమెడ్ దుస్తుల కంపెనీలను కూడా నిషేధించాలని, బహిష్కరించాలని సూచించింది.2023లో సంభవించిన వినాశకరమైన భూకంపం సమయంలో భారతదేశం టర్కీకి మానవతా సహాయం అందించింది, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్ కి అండగా నిలబడిందని స్వదేశీ జాగరణ్ ప్రతినిధులు మండిపడ్డారు. టర్కీ చేసిన పనులతో మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీ, అజర్ బైజాన్ పై తక్షణమే ఆర్థిక ఆంక్షలు, దిగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.