దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో మరో షాకింగ్ విషయం తెలిసింది. ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కాన్పూర్లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు. గత వారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్తో ఆరిఫ్ నిరంతరం టచ్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
విచారణ వర్గాల సమాచారం ప్రకారం, డాక్టర్ షాహీన్ ఫోన్ రికార్డులను పరిశీలించినప్పుడు ఆరిఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఆరిఫ్ నీట్-ఎస్ఎస్ 2024 బ్యాచ్ విద్యార్థి. ఫరీదాబాద్లోని అల్-ఫలా యూనివర్సిటీలో అతను విద్యనభ్యసించినట్లు తెలిసింది.
జైష్-ఎ-మహమ్మద్ (జేఈఎం), అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ (ఏజీయూహెచ్) అనే రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఫరీదాబాద్ మాడ్యూల్ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫరీదాబాద్లోని ధౌజ్ గ్రామంలో అద్దెకు తీసుకున్న ప్రాంగణంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్ను అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు, కశ్మీర్కు చెందిన మరో డాక్టర్ నిసార్-ఉల్-హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించగా, ఆ తర్వాత అల్-ఫలా యూనివర్సిటీ అతడిని నియమించుకుంది.

