![]() |
| bhagwat ji |
ఆశ్రమాలు కేవలం కడుపు నింపుకునే ప్రదేశాలు మాత్రమే కావని, అవి నిజమైన జ్ఞానానికి కేంద్రాలు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. బృందావన్ లోని ‘‘జీవన్ దీప్ ఆశ్రమం’’ ప్రారంభోత్సవంలో స్వామి అవధేశానందతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమాల ద్వారా వ్యక్తిలో ధైర్యం కూడా వస్తుందని, ఎంతలా అంటే.. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని నిలబడేంత ధైర్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు.
ఆశ్రమాలు అనేవి దేశానికి పాఠశాలల లాంటివి అని అభివర్ణించారు. వ్యక్తి జీవనానికి సంబంధించిన అన్ని రకాల విద్యలూ ఇక్కడే దొరుకుతాయని, ఆశ్రమాలకు వచ్చేవారికి, ఇక్కడ అధ్యయనం చేసే వారికి భౌతిక విషయాల పట్లే కాదు, ఆధ్యాత్మికత లాంటి ఉన్నత విషయాల వైపూ వెళ్లగలుగుతాడని అన్నారు.
మన ధర్మం ప్రకారం నాలుగో పురుషార్థం ధర్మమే అని, దీనికి సంబంధించిన పూర్తి ఉపదేశం ఆశ్రమాలలో లభిస్తుందని, అక్కడే బోధిస్తారని అన్నారు. ఆశ్రమాల ద్వారా వ్యక్తులు ఓ దీపంలా తయారై భాసిస్తారని, ఆ దీపం స్వయంగా కరిగిపోతూనే, తన చుట్టూ వున్న వారికి ప్రకాశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ‘‘జీవన దీపాలు’’వ్యక్తిగత ఆశయాలతో వుండవని, కష్టాలు ఎదురైనా తమ కర్తవ్యాలను విడిచిపోయే దుర్బలత్వం కూడా వారికి వుండదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ విధులను, కర్తవ్యాలను స్థిరచిత్తంతోనే నిర్వర్తిస్తారని, ఇలాంటి ఉత్తమ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత కేవలం ఆశ్రమాలలోనే జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ నేటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే వుందని ప్రకటించారు.
![]() |
| Ashrams |
అలాగే జనాభా పెరుగదలపై కూడా మోహన్ భాగవత్ మాట్లాడారు. మతం, వైద్యశాస్త్రం ప్రకారం ముగ్గురు సంతానం వుండాలని చెబుతున్నాయని, చివరికి ఆధునిక జ్ఞానం కూడా అదే చెబుతోందని అన్నారు. ముగ్గురు కంటే తక్కువ సంతానం వుండొద్దని జనాభా శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారన్నారు.నిజానికి, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ జనన రేట్లను పెంచుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నాయని గుర్తు చేశారు.
ఇక.. జునాగఢ్ అఖారా అధిపతి ఆచార్య అవధేశానంద గిరి ఆశీపూర్వక ప్రసంగం చేశారు. సాధులు, సంతులు వేర్వేరు అన్న తేడాలేమీ వుండవన్నారు. తాము నుదుటిన ధరించే త్రిపుండ్రాలు శైవానికి ప్రతీక అని, అంతర్గతంగా శాక్తేయులమని, ఆచరణలో మాత్రం వైష్ణవులం అని అన్నారు.
అలాగే సర సంఘచాలక్, స్వయంసేవక్ మధ్య తేడా ఏంటని తనను అడిగారని, అయితే.. వారిద్దరూ స్వయంసేవకులే అని తాను బదులిచ్చానని పేర్కొన్నారు. "నేను కూడా చిన్నప్పటి నుంచే స్వయంసేవకుడిగా ఉన్నాను, అలాగే యతీంద్రానంద్జీ కూడా చిన్నప్పటి నుంచే స్వయంసేవకుడిగా ఉన్నారు."అని కూడా చెప్పానని పేర్కొన్నారు.


