![]() |
| Department of Posts unveiled a special brochure on Hedgewar Residence |
నాగపూర్ : నాగపూర్ లోని తపాలా శాఖ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ ప్రారంభమైన చారిత్రక సందర్భ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ నివాసంపై ఓ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ సంఘ్ కి, డాక్టర్జీకి అభేదమన్నారు. హెడ్గేవార్ జీవితమంతా కేవలం సంఘ్ కార్యానికి, దేశ సేవకే అంకితమయ్యారని అన్నారు.
విజయదశమి నాడు సరిగ్గా ఇదే భవనంలోని ఒక చిన్న గదిలో సంఘ్ స్థాపించారని పేర్కొంటూ, చారిత్రక భవనం ప్రాముఖ్యతను మోహన్ భాగవత్ వివరించారు. విజయ దశమి పర్వదినాన సరిగ్గా ఇదే భవంతిలోని పై అంతస్తులో వున్న ఓ చిన్న గదిలో సంఘ్ స్థాపనకు పునాది పడిందని గుర్తు చేశారు.
"సంఘ్ యొక్క సమర్థవంతమైన వ్యక్తిత్వ నిర్మాణ విధానం నేడు భారతదేశానికే కాకుండా, అభివృద్ధి పథంలో పయనిస్తున్న అనేక దేశాలకు కూడా అత్యవసరంగా మారింది. దీని స్పష్టమైన ఫలితాలు సమాజంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కనిపిస్తున్నాయి. సంఘ్ కార్యకలాపాలు దేశ సేవకు అంకితమైనవి; అది ఎప్పుడూ ప్రచారాన్ని గానీ, కీర్తిని గానీ ఆశించలేదు." అని అన్నారు.
అయితే వందేళ్ల సంఘ్ ప్రయాణం గర్వానికి సంబంధించింది ఏమాత్రం కాదని, కర్తవ్యానికి, బాధ్యతకు నిదర్శనం అని అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా సంఘ్ పట్ల ఆసక్తి, గౌరవం పెరుగుతోందని, కానీ తమకు అహంకారం లేదని, అహంకారానికి సంబంధించిన విషయం కానే కాదన్నారు.అలాగే సమాజంలోని అనేక ప్రసిద్ధులు, ఉత్తమ వ్యక్తులు దేశ నిర్మాణ కార్యంలో తమ వంతు కృషి చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
మరోవైపు ప్రత్యేక కవర్, బ్రోచర్ ను విడుదల చేసినందుకు నాగపూర్ తపాలా శాఖకు మోహన్ భాగవత్ ధన్యవాదాలు ప్రకటించారు. సంఘం యొక్క లక్ష్యం మరియు ఉద్దేశాల గురించి సామాన్య ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో సహాయపడుతుందని అన్నారు.

.gif)