![]() |
| IB officer murder case: Former AAP leader Tahir Hussain gets life imprisonment |
ఢిల్లీ 2020 అల్లర్ల కేసుకి సంబంధించి కీలక పరిణామం జరిగింది. ఈ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కి ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అతడిపై మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడటం, దాడి చేయడం, నేరపూరిత బల ప్రయోగం, హత్య తదితర అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది.
హత్య తరువాత కూడా మృతుడిపై ద్వేషం తగ్గలేదని నేరం తీరు చూస్తుంటే అనిపిస్తోందని న్యాయస్థానం చెప్పింది. మృతదేహాన్ని ఈడ్చుకుంట తీసుకెళ్లి నాలాలో పడేశారని కోర్టు పేర్కొంది.కోర్టు తీర్పుపై తాహిర్ లాయర్ స్పందిస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకుంటామని అన్నారు. తనకు న్యాయం కొంత ఆలస్యంగానైనా దక్కుతుందన్న నమ్మకం ఉందని తాహిర్ తెలిపాడు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ తాహిర్కు యావజ్జీవం ఖరారు కావడంతో న్యాయం దక్కే దిశగా తొలి అడుగు పడిందని అన్నారు.
2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మ మరణించారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా మతపరమైన హింస చెలరేగింది, ఇందులో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అంకిత్ కుటుంబం ఇప్పుడు ఖజూరీ ఖాస్లోని తమ పూర్వీకుల ఇంట్లో నివసించడం లేదు. భద్రతా ఆందోళనలు, చేదు జ్ఞాపకాల భారం కారణంగా అల్లర్లు జరిగిన వెంటనే వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు.
25 ఫిబ్రవరి 2020న అంకిత్ ఇంటి సామాగ్రి తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. పోలీసుల కథనం ప్రకారం, గుంపు ఆయనను కిడ్నాప్ చేసి, హత్య చేసి, మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. మరుసటి రోజు ఉదయం మురికి కాలువ నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నివేదికలో అంకిత్ను 52 సార్లు కత్తితో పొడిచినట్లు తేలింది. వీటన్నింటిని వినడం, గుర్తుచేసుకోవడం కుటుంబ సభ్యులకు ఎంతో కష్టంగా మారింది.
అంకిత్ మరణం ఆ కుటుంబంపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆయన తల్లిదండ్రులు హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు. అల్లర్లు లేదా ఈ కేసుకు సంబంధించిన చర్చలు జరిగినప్పుడల్లా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిందితులందరికీ ఉరిశిక్ష లేదా కఠినాతికఠినమైన శిక్ష పడినప్పుడే తమకు పూర్తి న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

