బాధ్యత లేని, మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణు బాంబులు వుండటం అంత శ్రేయస్కరం కాదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు భద్రంగా వున్నాయా? అంటూ ప్రపంచాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలు తీసుకొని పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మొదటి సారిగా రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్ లో గురువారం పర్యటించారు.అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఆర్మీకి సంబంధించిన 15 కాప్స్ హెడ్ క్వాటర్స్కు కూడా ఆయన వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు.
ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన భారత జవాన్లకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడున్నా నాశనం చేస్తామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఓ పేరు మాత్రమే కాదని, అదో నిబద్ధతతో కూడిన అంశమని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మన బలగాలు అద్భుతంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు.
‘‘మన సైన్యం కచ్చితమైన లక్ష్యంతోనే రంగంలోకి దిగిందని ప్రపంచానికి తెలుసు. లక్ష్యాన్ని ఛేదించినప్పుడు వారు కౌంటింగ్ ను వారికే వదిలేస్తారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్న భారత దేశ ప్రతిజ్ఞ చాలా బలంగా వుంది. వారు అణ్వాయుధాల బ్లాక్ మెయిల్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత బాధ్యతా రాహిత్యంగా పాకిస్తాన్ వుందో యావత్ ప్రపంచమే చూస్తోంది’’అని రాజ్ నాథ్ అన్నారు.