రాముని అడుగుజాడలో బీజేపీ ప్రభుత్వం !

The Hindu Portal
0
రాముని అడుగుజాడలో బీజేపీ - Bjp in Ram's footsteps
అయోధ్య
 అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆరంభమైంది. ఇది భారతీయ జాగృతిలో కొత్త మలుపు. ఇందుకు అనేక కారణాలు. ఆధ్యాత్మిక పరమైనవి, రాజకీయ, సామాజిక కారణాలు కూడా ఇందుకు తోడ్పడినాయి. రామమందిరం భారతీయులను ఏకం చేస్తున్నది. అంటే చారిత్రక తప్పిదాలను సవరిస్తున్నది. ఈ క్రమంలోనే భారతీయులకు ఆరాధ్యగ్రంథం రామాయణం, పూజనీయ పురాణపురుషుడు రాముడి జీవితగాథకు సంబంధించినవిగా చెప్పుకునే, హిందువులు ప్రగాఢంగా విశ్వసించే పుణ్యస్థలాల మీద ఇప్పుడు ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. వాటిని అభివృద్ధి చేయ సంకల్పించాయి. ఇదొక ఐక్యతా సందేశమే. హిందువులందరినీ ఏకం చేయడం. కొండకోనలలో ఉండే గిరిపుత్రులతో ఆలింగనం కూడా ఇందులో భాగం. రాముడు నడయాడిన ప్రదేశమంతా కొండాకోనాయే కదా! సంఘం, దేశం, కుటుంబం మధ్య ఉండవలసిన బంధం గురించే కాదు, సమస్త జీవజాలంతో మానవునికి ఉండవలసిన బాంధవ్యం గురించి కూడా ఆ మహాకావ్యం చెబుతుంది.

  పితృవాక్య పరిపాలన కోసం రామచంద్ర ప్రభువు అయోధ్యాపురిని విడిచి పెట్టి అడవులకు బయలుదేరాడు. వెంట సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా ఉన్నారు. ఆయన అడవులకు నడచిన దారి వర్ణనలతో మార్గ మధ్యంలో ఆయన కలుసుకున్న వ్యక్తుల ఉదంతాలతో రామాయణ కావ్యం ఎంతో శోభాయ మానంగా ఉంటుంది. మర్యాదారామన్న నడిచినట్టు చెప్పే అదే దారిని ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక రహదారిగా, పర్యాటక కేంద్రంగా మలచాలని సంకల్పించింది. రాముడి జీవితంతో ముడిపడి ఉన్న అయోధ్య-చిత్రకూట్లను కలపుతూ ఈ రహదారిని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నది. నిజానికి జనవరి 21, 2015న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇచ్చిన ప్రకటనతో వీటన్నిటికి కదలిక వచ్చిందనిపిస్తుంది. ఆనాడు విలేకరులతో మాట్లాడుతూ గడ్కరి, ఇది రామభక్తుల ప్రభుత్వమని నిర్ద్వంద్వంగా చెప్పారు. అదే సమయంలో అయోధ్యను, నేపాల్ ను కలుపుతూ రామ్-జానకి మార్గ్ నిర్మించనున్నట్టు కూడా ఆయన చెప్పారు. రామ వన గమన మార్ట్ గురించి కూడా అదే రోజు ఆయన ప్రస్తావించడం విశేషం. ఇప్పుడు ఆ బృహత్ ప్రణాళిక నిజరూపం దాల్చబోతున్నది.

రామాయణ వస్తు ప్రదర్శనశాల :
   అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. ఆ మహా కార్యక్రమానికి అనుబంధంగా పలు సాంస్కృతిక, పర్యాటక పథకాలను కేంద్రం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోతున్నాయి. అయోధ్య-లక్నో జాతీయ రహదారిలో ఉన్న రామస్నేహి ఘాట్ దగ్గర ఒక దివ్యమైన వస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేయడానికి కూడా ఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నాహాలు ప్రారంభించారు. రామాయణ గాథతో సంబంధం ఉన్న వస్తువులు, కళాఖండాలతో ఈ వస్తు ప్రదర్శనశాల, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తారు. లక్నోకు కిలోమీటర్లు, అయోధ్యకు 64 కిలోమీటర్ల దూరంలోను ఉన్న రామస్నేహి ఘాట్ ఇందుకు వేదిక కాబోతున్నది. ఈ వస్తు ప్రదర్శన శాలలోనే ఏర్పాటు చేస్తున్న బొమ్మలాట ఎంతో ప్రత్యేకమైనది.
   భారత్ సహా రష్యా, జపాన్  ఇండోనేషియా, మలేసియా, థాయ్లాండ్ వంటి దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న రామకథలే ఇతివృత్తంగా ఆ బొమ్మలాట ఉంటుంది. అలాగే మధుబ్, అయోధ్య, చత్తీస్గడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, శ్రీలంకలకు చెందిన వంటకాలతో ఇక్కడే ఒక వంటశాల కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ కూడా ఒక రామమందిరం నిర్మిస్తారు. ఈ వస్తు ప్రదర్శన శాల - సాంస్కృతిక కేంద్రం పదెకరాల స్థలంలో రూపొందిస్తారు. రామాయణం ప్రాతిపదికగా ఉండే పుస్తకాలతో ఒక భాండాగారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

రామ వన గమన మార్గం :
  కిలోమీటర్ల ఆ రహదారికి ' రామ వన గమన ' మార్గం'గా పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోనే అయోధ్య' చిత్రకూటం వరకు ఆ మార్గం నిర్మిస్తున్నారు. ఫైజాబాది సుల్తాన్ పూర్, ప్రతాప్ గఢ్, జెత్వారా, శ్రిన్వేర్పూర్, మాంఝన్ పూర్, రాజాపూర్ పట్టణాల మీదుగా ఈ రహదారిని నిర్మిస్తారు. తమ రాష్ట్రాలలో కూడా ఇదే పేరుతో జాతీయ రహదారి నిర్మించాలన్న ఆకాంక్ష గురించి ఇప్పటికే మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని సంప్రతించాయి. రామ వన గమన మార్గం పథకం తొలిదశలో ప్రతిపాదిత మార్గంలోని ఎంపిక చేసిన ఎనిమిది ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం రూ. 137. 45 కోట్లు ఖర్చు చేస్తారు. 28,96, 731ఏ జాతీయ రహదారులతో కూడా ఈ మార్గం అనుసంధానమై ఉంటుంది. ఈ మార్గం నిర్మాణంలో భాగంగానే శ్రీన్వేర్పూర్ దగ్గర గంగ మీద ఒక వారధి కట్టాలని ప్రతిపాదించారు. ఎంపి, చత్తీస్గఢ్ ల ప్రతిపాదనలు కూడా కలిపి మొత్తం పథకానికి సంబంధించిన ప్రణాళికలు సిద్దమవుతున్న సంగతి కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కర్ చెప్పారు. మొత్తం 4,080 కిలోమీటర్ల మార్గమిది. రూ. 35,000 కోట్లు ఖర్చు చేస్తారు. భారత్మాలా పరియోజన పథకంలో ఇది అంతర్భాగంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో చిత్రకూట్తో పాటు శారదా శక్తిపీఠాన్ని (మైహార్ ఆలయం) కూడా ఈ మార్గం కలుపుతుంది.

చత్తీస్గఢ్లో రామ వన గమన పథ్ :
  2019 నవంబర్ లోనే రామ వన గమన పథం పేరుతో  ఈ మార్గ నిర్మాణం గురించి ప్రకటించింది. అయోధ్య నుంచి రాముడు అడవులకు వెళ్లినప్పుడు ఛత్తీస్ఘడ్ ప్రాంతంలోని 75 ప్రదేశాల గుండా నడిచి వెళ్లాడని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. అందులో 51 ప్రదేశాలలో బస చేశాడని కూడా వారు నమ్ముతారు. ఇందులోని ఎనిమిది పుణ్యస్థలాలను రామగమన పథం ప్రణాళిక తొలిదశలో
అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 
అందులో:- 
  1. సీతామారి హర్చయిక (కురియా జిల్లా), 
  2. రామ్గఢ్ (సర్గుజా జిల్లా) 
  3. తుత్తురియా (బాలోదాబజార్- భాతాపారా జిల్లా). 
  4. శివారినారాయణ్ (జాంజ్గీర్-చంపా జిల్లా) 
  5. చందఖురి (రాయపూర్ జిల్లా), 
  6. శిహావా (సప్తరుషి ఆశ్రమం-ధంతారి జిల్లా) 
  7. రాజిం (గరియాబండ్ జిల్లా), 
  8. జగదల్పూర్ (బస్తర్ జిల్లా) ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా రామ్ వన గమన పద్  ప్రణాళిక కు యోజన చేసింది. అయోధ్య శ్రీరాముడిదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించిన వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గ నిర్మాణానికి పథకం రూపొందించింది. చిత్రకూట్ సహా పన్నాబ ధ్వారా (కట్నీ జిల్లా), రామ్ఘాట్ (జబల్పూర్) దిందోరి, షాదోల్, రామ మందిర్ తలాబ్, రామనగర్ మాండ్లా, అమర్ కంటక్ (అనుపూర్ జిల్లా)లకు అభివృద్ధి చేస్తున్నారు. చిత్రకూట్ నుంచి అమర్కంటక్ కు నాలుగు వరసల జాతీయ రహదారితో పాటు, పాదయాత్రకు కూడా వేరే మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో సైకిల్ పర్యాటకం పచ్చదనం అభివృద్ధికి కూడా చోటు కల్పిస్తున్నారు.

Chitracoot
చిత్రకూట్ :
   ఇది అటు ఉత్తరప్రదేశ్, ఇటు మధ్యప్రదేశ్లో కూడా విస్తరించి ఉన్న అద్భుత ప్రదేశం. అరణ్యవాసం కోసం అయోధ్య నుంచి బయలుదేరిన సీతారాములు లక్ష్మణుడు చిత్రకూట్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దత్తాత్రేయుడు, మార్కండేయుడు, అత్రి వంటి మహామునులంతా ఇక్కడే తపస్సు చేశారని ప్రతీతి. చిత్రకూట్ అంటేనే అనేక అద్భుతాల పర్వతమని అర్ధం. వాల్మీకి, కాళిదాసు సహా ఎందరో సంస్కృత మహాకవులు ఈ పర్వతం గురించి వర్ణించారు. ★___జాగృతి

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top