హిందూ సమాజ ఐక్యతే జాతీయ, సామాజిక సవాళ్లకు పరిష్కారమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారత్ ముందుకు సాగుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదగాలని, పరిస్థితులు ఎంత అనుకూలంగా వున్నాయో... సవాళ్లు కూడా అదే మోతాదులో వున్నాయన్నారు. అయితే.. భారత్ ఎదుగుతున్న క్రమాన్ని చూసి, కొన్ని దేశాలు ఓర్వలేకపోతున్నాయని, తమ దుకాణాలు ఎక్కడ బంద్ అవుతాయోనని భయపడుతున్నాయని అన్నారు. అందుకే భారత్ వృద్ధికి అనేక అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
బిహార్ లోని ముజఫర్ పూర్ లో ‘‘సామాజిక సద్భావన గోష్ఠి, సంవాద్ అనే కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయాన్ని అధిగమించడానికి స్వావలంబన అత్యావశ్యకమని, స్వావలంబన ద్వారా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు.
సామాజిక సమరసత అనేది ప్రపంచానికి నేటి కాలంలో అత్యవసరమని, సామరస్యం లేకపోతే ప్రజలు ఒకరి ఒకరు పోరాడుతూ, వినాశక స్థితిని చేరుకుంటారన్నారు. ఏ విదేశీ శక్తి కూడా బల ప్రయోగం ద్వారా భారత్ ను బానిసగా చేయలేదని, మన అంతర్గత విభజనను ఆసరాగా చేసుకొని, గతంలో విజయం సాధించారన్నారు.
సమాజంలో సామరస్యం పెంపొందినప్పుడు ప్రజలు ఒకరి సుఖ దుఖాలను మరొకరు పంచుకుంటారని, అనేక సమస్యలను కూడా వారంతట వారే పరిష్కరించుకుంటారని వివరించారు. సమాజం ఇప్పుడు మేల్కొంటోందని, దేశం వృద్ధి చెందుతోందన్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు బ్లాక్, సబ్ బ్లాక్ స్థాయిల్లో ప్రజలపై ఆధారపడాల్సిన అవసరమే లేదని, సమాజమే చొరవ తీసుకొని, పరిష్కరించుకుంటుందన్నారు.
సమస్యలను ఎలా గుర్తిస్తున్నామో.. అలాగే వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించాలని భాగవత్ సూచించారు. కొందరు నీతిమంతులు దేశంలోని సమస్యలను పరిష్కరించడానికి తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మరింత కిందికి విస్తరించాలని ఆకాంక్షించారు. వ్యవస్థలు మాత్రమే సమస్యలను పరిష్కరించలేవని, సమాజం కలిసి కూర్చొని, ఆలోచించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ మేరకు సమాజాన్ని మేల్కొల్పడానికే సంఘ్ కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు.
సమాజానికి సేవ చేసేది కేవలం సంపన్నులు మాత్రమే కాదని, సామరస్యాన్ని పెంపొందించే వారే, నిజంగా కష్టాల్లో వున్న వారికి, అణగారిన వర్గాలకు సేవ చేయగలరన్నారు .పేదలు, పీడితులు మరియు అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఉదాహరణగా ఉటంకిస్తూ..ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకుంటారన్నారు. అందువల్ల, ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుని, స్థానిక సమస్యలను పరిష్కరించడానికి వారి స్థాయిలోనే పనిచేయాలని సూచించారు. సంఘ్ గ్రామ, బ్లాక్ స్థాయిల్లో సమావేశాలను నిర్వహిస్తుందని,ప్రజలే అందరూ సోదరభావంలా ఒక చోట చేర్చి, మాట్లాడుకునేలా ప్రోత్సహిస్తుందన్నారు. సమస్యలపై చర్చించడానికి అందరూ కలిసి కూర్చుంటే.. ఏ బయటి శక్తులు కూడా హిందూ సమాజాన్ని విభజించలేవన్నారు.
వ్యక్తి, లేదా వర్గ ప్రయోజనాల కంటే హిందూ సమాజ సంఘటనే ముఖ్యమని భాగవత్ నొక్కి చెప్పారు. హిందూ సమాజంలోని అన్ని వర్గాలను బలోపేతం చేయాలని, సాధికారత దిశగా వారిని తీసుకెళ్లాలని అన్నారు.

